ఆదోని, జూలై 27: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు, విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కె. అరుణ దేవి తెలిపారు. సోమవారం ఆదోని పట్టణంలోని బీసీ బాలుర, కళాశాల బాలికల వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులతో మాట్లాడుతున్న ఆర్డీవో అరుణాదేవి
ఈ సందర్భంగా హాస్టళ్లలో ఆహార నాణ్యత, వంటశాలల శుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు రికార్డులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వంటశాలను పరిశీలిస్తున్న ఆర్డీవో అరుణాదేవి
అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ… మెనూ ప్రకారమే పోషకాహారం అందించాలని, పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని వార్డెన్లను హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తనిఖీల్లో గుర్తించిన చిన్నచిన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో సబ్సిడీ ధరకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్సీ బీటీ నాయుడు చేతుల మీద ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమాపతి నాయుడు హాజరయ్యారు.
సబ్సిడీ సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ, రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారునికి కిలో రూ.50 చొప్పున నెలకు 10 కిలోల సన్న బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం రైతు బజార్తో పాటు పట్టణంలోని ప్రధాన సూపర్ మార్కెట్లలో కూడా ఈ బియ్యాన్ని అందుబాటులో ఉంచామని, పేద, మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చిన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉమాపతి నాయుడు
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ శారద, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, టీడీపీ నాయకులు తిమ్మప్ప, శివప్ప, రంగస్వామి నాయుడు, జిందే శంకర్, గుడిసె శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
■10 రోజులకొకసారి మంచినీళ్లు.. రోడ్లు, డ్రైనేజీలు లేక నరకయాతన ■ సచివాలయ తలుపులకు వినతిపత్రం అతికించిన కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు
ఆదోని (కర్నూలు జిల్లా): ఆదోని మండలం బసరకోడు గ్రామంలోని దళిత కాలనీవాసులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే అక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
వినతిపత్రం అందజేయడానికి వస్తే తాళం వేసి ఉన్న గ్రామ సచివాలయం
మంగళవారం దళిత కాలనీలో పర్యటించిన వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఉచ్చిరప్ప, కేవీపీఎస్ మండల అధ్యక్షుడు మునిస్వామి, నాయకుడు రామాంజనేయులు స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. కాలనీలో రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ లేక రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీసం పది రోజులకు ఒకసారి కూడా తాగునీరు అందడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
యూట్యూబ్ వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
అధికారుల నిర్లక్ష్యంపై నిరసన: స్థానిక సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసేందుకు ఉదయం 10:40 గంటలకు గ్రామ సచివాలయానికి వెళ్లగా, అప్పటివరకు ఏ ఒక్క అధికారీ కార్యాలయానికి రాలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమయపాలన తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, వినతిపత్రాన్ని సచివాలయ తలుపులకే అతికించి నిరసన తెలిపారు. పాలకులు, అధికారులు స్పందించి దళిత కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 04 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1616.13 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 51.145 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు:
ఇన్ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 82087 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్ఫ్లో 91546 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
అవుట్ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1447 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 712.654 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదోని, ఆగస్టు 1: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారి–167పై అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఆదోని బసవేశ్వర సర్కిల్ నుండి మాధవరం క్రాస్ వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) శనివారం ఆర్డీఓ శ్రీమతి కె. అరుణాదేవి నేతృత్వంలో అధికారులు పరిశీలించారు.
ఆర్డీవో మరియు ఆర్టిఓ అధికారులకు తనిఖీలు చేస్తున్న ఫోటో
ఈ పరిశీలనలో రోడ్డు వెడల్పు, ప్రమాదకర మలుపులు, ప్రధాన కూడళ్లు, మీడియన్ ఓపెనింగ్స్, డ్రైనేజీ వ్యవస్థ, హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళల్లో వెలుతురు (స్ట్రీట్ లైటింగ్) మరియు పాదచారుల భద్రతా అంశాలను అధికారులు సమగ్రంగా సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి కె. అరుణాదేవి, ఆర్డీఓ ఆదేశాలు & సూచనలు చేశారు.
ఆర్డీవో అధికారులతో కలసి తనిఖీలు చేస్తున్న ఫోటో
తక్షణ భద్రతా చర్యలు: ప్రమాదకర ప్రాంతాల్లో వెంటనే హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, రిఫ్లెక్టివ్ క్యాట్ ఐస్, క్రాష్ బ్యారియర్లు, స్పీడ్ లిమిట్ బోర్డులు, సోలార్ బ్లింకర్లను ఏర్పాటు చేయాలి. శాశ్వత పరిష్కారాలు: సర్వీస్ రోడ్లు, బస్ బేల నిర్మాణం, వర్షపు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం మరియు ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన పూర్తి చేయాలి. అవగాహన కార్యక్రమాలు: ఇంజినీరింగ్ లోపాలను సరిచేయడంతో పాటు, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి.
ఆర్డీవో అధికారులతో కలసి తనిఖీలు చేస్తున్న ఫోటో
ఈ తనిఖీ కార్యక్రమంలో ఆర్డీఓతో పాటు రోడ్లు & భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహేశ్వర రెడ్డి, నేషనల్ హైవేస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (DTC) శ్రీమతి శాంతకుమారి, రెవెన్యూ, రవాణా, నేషనల్ హైవేస్, ఆర్అండ్బీ మరియు పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆదోని పట్టణ సమగ్ర అభివృద్ధి సాధించాలంటే కమర్షియల్ భవనాల నిర్మాణాల్లో ప్రతి ఒక్కరూ మున్సిపల్ నిబంధనలు, పట్టణ ప్రణాళిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్థానిక శాసనసభ్యులు డా. పి.వి. పార్థసారథి వాల్మీకి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదోనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వంతెన ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాల వల్ల పట్టణంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణ సమయంలో అవసరమైన సెట్బ్యాక్లు వదలకుపోవడం, ప్రజా వినియోగ స్థలాలను ఆక్రమించడం వల్ల రహదారులు ఇరుకుగా మారుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, తాగునీటి పైప్లైన్ల నిర్వహణ కూడా మున్సిపల్ అధికారులకు పెద్ద సవాలుగా మారిందని వివరించారు.
హోటల్ యజమానిని పరిగణిస్తున్న ఎమ్మెల్యే
చట్టబద్ధమైన అనుమతులు తప్పనిసరి: కమర్షియల్ కాంప్లెక్స్లు, భవనాలు నిర్మించేవారు ప్రజా ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత అధికారుల నుండి చట్టబద్ధమైన అనుమతులు పొందిన తర్వాతే, పట్టణ ప్రణాళికకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
బట్టల షాప్ యజమానులను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే
ప్రజల సహకారం కోరిన ఎమ్మెల్యే: ఆదోని పట్టణ ప్రజలకు మెరుగైన రహదారులు, సమర్థవంతమైన మురుగునీటి పారుదల వ్యవస్థ, నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందన్నారు. పట్టణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పట్టణాన్ని సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ మున్సిపల్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి వాల్మీకి విజ్ఞప్తి చేశారు.
గోనెగండ్ల (కర్నూలు జిల్లా): ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం నిర్వహించే “ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు” కార్యక్రమాన్ని గోనెగండ్ల మండల కేంద్రంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ సిరి
బైలుప్పల గ్రామానికి చెందిన రైతు దాసరి జాంబయ్యకు చెందిన 2.70 ఎకరాల భూమి గత 18 ఏళ్లుగా పొరపాటున ఇనాం జాబితాలో ఉంది. ఈ రికార్డులను వెంటనే సరిచేసి, ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతుకు ఆన్లైన్ అడంగల్ అందజేశారు.
ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు పర్యటనలు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు స్థానికులు
కలెక్టర్ డా. ఏ. సిరి మీడియా తో మాట్లాడుతూప్రతి శుక్రవారం స్వీకరించే వినతులపై తదుపరి శుక్రవారం రోజు సమీక్ష నిర్వహించి, జవాబుదారీతనంతో సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. 22-ఏ నిషేధిత జాబితా, రీ-సర్వే వ్యత్యాసాలు, ఇనాం భూముల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ వెంకటనారాయణమ్మ, ఆదోని ఆర్డీఓ అరుణాదేవి, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గం తొలి పర్యటన సందర్భంగా గోనెగండ్ల మండలం లో ఈరోజు మొత్తం 235 వినతులు అందినాయి అని అధికారులు తెలిపారు. శాఖల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి: రెవెన్యూ – 142, సర్వే – 71, పెన్షన్లు – 9, పంచాయతీ రాజ్ (PR) – 2, పీఆర్ & ఈసీ (PR&E) – 5, వ్యవసాయ శాఖ – 2, గ్రామీణ నీటి సరఫరా (RWS) – 1, పౌర సరఫరాల శాఖ – 1, ప్రజారోగ్య శాఖ – 1, ఏపీఎస్పీడీసీఎల్ – 1
ఆదోని, జూలై 31: తుంగభద్ర డ్యామ్ నుంచి కెనాల్కు కొత్త నీరు విడుదల చేసిన నేపథ్యంలో, పట్టణ ప్రజలందరూ తాగునీటి వినియోగంలో కొన్ని రోజుల పాటు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఆదోని మున్సిపాలిటీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. తుంగభద్ర ఎల్ ఎల్ సి కాల్వలో కొత్తగా నీటిని విడుదల చేసిన ప్రారంభ రోజుల్లో నీటితో పాటు మట్టి, చెత్త మరియు ఇతర అవశేషాలు కలిసి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ దృష్ట్యా మున్సిపాలిటీ వాటర్ సప్లై సిబ్బంది నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన క్లోరినేషన్ చర్యలు చేపడుతున్నారని స్పష్టం చేశారు.
నీటిని కాచి చల్లార్చిన తర్వాత తాగాలి అని చూపిస్తున్న ఫోటో
ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు: తాగునీటిని తప్పనిసరిగా మరిగించి, చల్లార్చిన తర్వాత మాత్రమే తాగాలి. నీటిని శుభ్రమైన, మూత ఉన్న పాత్రల్లో మాత్రమే నిల్వ చేసుకోవాలి. తాగునీటి ట్యాంకులు, సంపులు మరియు నిల్వ పాత్రలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్న పిల్లలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఖచ్చితంగా కాచి చల్లార్చిన నీటినే వినియోగించాలి. సరఫరా అయ్యే నీటిలో రంగు, వాసన లేదా మలినాలు కనిపిస్తే వెంటనే మున్సిపాలిటీ అధికారులకు సమాచారం అందించాలి. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు .ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఈ సూచనలను పాటించి మున్సిపాలిటీకి సహకరించాలని ఆదోని పురపాలక సంఘం కమిషనర్ కోరారు.
ఆదోని 31.07.2026 : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (APBJA) ఆదోని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మార్చి 4న నిర్వహించిన మహాపదయాత్రలో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ, ప్రధాన సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని గుర్తుచేశారు.
ఆర్డీవో కార్యాలయం ముందు ఆదోని జర్నలిస్టులు
ముఖ్యమైన డిమాండ్లు: రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ 3 సెంట్ల చొప్పున స్థలాలు కేటాయించాలి. విశాఖపట్నం, హిందూపురం వంటి ప్రాంతాల్లో నిలిచిపోయిన స్థలాల అప్పగింత ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి. గిరిజన ప్రాంత జర్నలిస్టులకు సమీప మైదాన ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణానికి తక్కువ వడ్డీకే రుణాలు, ఆర్థిక సహాయం అందించాలి. జర్నలిస్టుల భద్రత, పని పరిస్థితులు, ఉద్యోగ భద్రతపై అధ్యయనం చేయడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో సీనియర్ జర్నలిస్టులతో ప్రత్యేక మీడియా కమిషన్ ఏర్పాటు చేసి 6 నెలల్లో నివేదిక తెప్పించాలి.
ఆర్డీవో కార్యాలయం ముందు ఆదోని జర్నలిస్టులు
ఇతర రాష్ట్రాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి అధ్యయన కమిటీని నియమించాలి. దాదాపు 50 ఏళ్లుగా ప్రచురితమై, ఇటీవల నిలిచిపోయిన ప్రభుత్వ ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రిక ముద్రణను వెంటనే పునరుద్ధరించాలి. నూతనంగా ఏర్పడిన 28 జిల్లాల అవసరాలకు అనుగుణంగా సమాచార పౌరసంబంధాల శాఖను ఆధునీకరించి, తగినంత సిబ్బందిని నియమించాలి.జర్నలిస్టులందరికీ ఏసీ బస్సులతో సహా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత/రాయితీ ప్రయాణ సౌకర్యాన్ని, అలాగే రైల్వే పాస్ల మంజూరు ప్రక్రియను సులభతరం చేయాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 50 కోట్లతో ‘జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్’ ను పునరుద్ధరించాలి. దాడులను అరికట్టేందుకు హోంశాఖ మంత్రి నేతృత్వంలో హైపవర్ కమిటీ, జిల్లా స్థాయిలో పోలీస్ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలి. సి. రాఘవాచారి మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ నియమించి వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. నిలిచిపోయిన రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ అవార్డులను ప్రతి ఏటా ప్రదానం చేయాలి. అసంగతిత రంగానికి ఇచ్చే బీమా సదుపాయాన్ని జర్నలిస్టులకు వర్తింపజేయాలి. వయోవృద్ధులైన జర్నలిస్టుల సామాజిక భద్రత కోసం రాష్ట్ర కేంద్రంలో ప్రత్యేక వృద్ధాశ్రమం నిర్మించాలి.
ఈ కార్యక్రమంలో APWJF అధ్యక్షులు, కార్యదర్శులు, ఈసీ సభ్యులు మరియు ఆదోని డివిజన్కు చెందిన పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 31 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1609.74 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 37.063 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు:
ఇన్ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 15690 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్ఫ్లో 16050 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
అవుట్ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 3648 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1624.83 అడుగులుగా ఉండగా.. 74.934 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 69.086 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రేమించిన యువతికి వేరొకరితో పెళ్లి అయ్యిందన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదోని – కుప్పగల్లు రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది.
రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోని మండలం గనేకల్ గ్రామానికి చెందిన పాండవగల్లు శివరాజ్ (20) బుధవారం (జూలై 29) రాత్రి ఇసవి-కుప్పగల్లు రైల్వే స్టేషన్ల మధ్య కేఎమ్ నెంబర్ 504/23-21 వద్ద అప్లైన్ రైల్వే ట్రాక్పై రైలు కింద పడి మృతి చెందాడు. బిటిపిటి గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
రైల్వే పట్టాలపై మృతుడు
మృతుడి తండ్రి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, అప్పటి నుంచి శివరాజ్ జులాయిగా తిరుగుతూ తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తన అక్క కూతురిని ఇష్టపడగా, అతని ప్రవర్తన నచ్చని అక్క తన కుమార్తెను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివరాజ్ గుర్తుతెలియని రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.