కర్నూలు జిల్లా ఆదోని నీటి సమస్య నివారణకు చర్యలు తీసుకోవాలని సలహాలు, సూచనలతో కూడిన వినతి పత్రం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎ. నూర్ అహ్మద్ మరియు నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మాట్లాడుతూ అవినీతి నిర్లక్ష్యముతో కట్టబడిన బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంకు శిథిలావస్థకు చేరిందని ఆలాగే వదిలేస్తే కట్ట తెగి సమ్మర్ స్టోరేజి ట్యాంక్ అంతమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు.
ఈ ట్యాంకులో ప్రస్తుత వానాకాలంలో నీరు నింపకపోతే రాబోయే ఎండాకాలంలో ఆదోని ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క వందల ఏళ్ల నాటి రామజల చెరువు నీరు నిండుగా ఉన్నా ఆ నీరు తాగడానికి పనికి రావని మునిసిపల్ చైర్మన్ చెప్పటం మునిసిపాలిటీ అధికారుల, పాలకుల వైఫల్యమే అని అన్నారు.
ఆదోనిలో చీరలు జాకెట్ల రాజకీయం నడుస్తోంది అని రాబోయే రోజుల్లో చీరలు జాకెట్లు ఉతుక్కోవటానికి నీరు దొరకని పరిస్థితి రాబోతుందని నాయకులు గ్రహించాలి అని తెలిపారు.
ఇప్పటికైన పాలకులు, అధికారులు బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును యుద్ధ ప్రాతిపదికన రాతి గోడలతో పటిష్టం చేసి నింపాలని,
రామజల చెరువును శుభ్రపరిచి, పూర్తి స్థాయిలో నింపాలని, కొండలనుంచి చెరువులోకి వచ్చే నీటిని పక్కదారి పట్టకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమములో ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎ. నూర్ అహ్మద్ మరియు కుబేర స్వామి, వసీమ్ సాహెబ్, నరేంద్ర యాదవ్ పాల్గొన్నారు.