కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో కొనసాగుతున్న వరుస వర్షాల దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత విభాగాల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శుక్రవారం రామ్ జల చెరువు మరియు లోతట్టు ప్రాంతాలను అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణను కట్టుదిట్టంగా చూసుకోవడమే కాకుండా అవసరమైన చోట్ల తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ప్రజలకు సమాచారం చేరే విధంగా నిరంతరం మానిటరింగ్ చేయాలని, లోతట్టు ప్రాంతాలు, నదీతీర ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి టామ్ టామ్ ద్వారా దండోరా వేయించి అప్రమత్తం చేయాలన్నారు.
పునరావాస కేంద్రాలను ముందస్తుగానే సిద్ధం చేసి, అవసరం వచ్చినపుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారుల సమన్వయం అత్యవసరమని, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. వాగులు, వంకలు పొంగిపొర్లే పరిస్థితుల్లో వాహన రాకపోకలు నిలిపివేసి, ప్రజలను సురక్షితమైన ప్రత్యామ్నాయ రహదారులపైకి మళ్లించాలని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు విద్యుత్ శాఖ అధికారులు ఫీల్డ్లో అప్రమత్తంగా ఉండాలని, లోపాలను వెంటనే పరిష్కరించాల్సిందిగా సూచించారు. ప్రజల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎటువంటి అజాగ్రత్త వహించకుండా. అధికారులు క్షణక్షణం పరిస్థితిని సమీక్షిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని. వర్షాలు తగ్గుముఖం అయ్యేంతవరకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అని స్పష్టం చేశారు.