కర్నూలు జిల్లా రైతులు పంటలు పండక తీవ్రంగా నష్టపోతు వలసలు వెళ్తున్నారని. తుంగభద్ర నది నుంచి సుమారు 200 టీఎంసీ నీళ్ళు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి వీటిని వాడుకోవటం వల్ల కర్నూలు జిల్లా రైతులను ఆదుకున్నట్లు అవుతుందని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు కర్నూలు జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి పి.సాయిబాబ. అనంతరం సీఎం చంద్రబాబు కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా వినతిపత్రంలో పొందుపరిచిన విషయాలను వివరించారు.
- మంత్రాలయం నియోజకవర్గంలో అధిక భాగము వర్షాధార భూములే ఉనందున పంటలు పండక వలసలు వెళుతున్నారు. తుంగభద్ర డ్యాం నుండి ఆంధ్రప్రదేశ్ వాటాగా 734 క్యూసెక్కుల నీరు రావాల్సివుండగా, ఎల్.ఎల్.సి, ద్వారా కేవలం 250 క్యూసెక్కులు నీరు మాత్రమే వస్తున్నాయని తెలిపారు.
- సుమారు 200 టి.ఎం.సి ల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఈ నీటిని వాడుకోవడానికి గుంతకల్ బళ్ళారి రహాదారిలో హగరి వద్ద ఒక ప్రాజెక్టు నిర్మించి గ్రావిటీ ద్వారా వేదవతి ప్రాజెక్టుకు అనుసంధానం చేసి 60 టి.ఎం.సి. నీటిని కర్నూలు జిల్లాకు కేటాయిస్తే సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.
- ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో రిజర్వాయర్లు నిర్మించడం వల్ల కర్నూలు జిల్లా కు నీటి సౌలభ్యం ఏర్పడుతుందన్నారు.
- ఎల్.ఎల్.సి. కెనాలుకు 50కి.మి. వద్ద సిరిగేరి గ్రామం (కర్నాటక) నుండి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో 251 కి.మి. హానవాలు గ్రామము వరకు షార్ట్కట్ అండర్ గ్రౌండ్ పైపు లైన్ నిర్మించి ఎల్.ఎల్.సి.కి. అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
- కౌతాళం మండలం, మ్యాళిగనూరు వద్ద భారీ స్థాయిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తుంగభద్ర నదిపై నిర్మిస్తే సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
- ఆర్.డి.ఎస్. 4 టి.ఎం.సి.ల నీటి కొరకు నిర్మిస్తున్న ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.
- వేదవతి ప్రాజెక్టు నిర్మాణము కొనసాగించాలని కోరారు.
- కౌతాళం నుండి సి.బెళగల్లు వరకు తుంగభద్ర నదిపై యున్న 11 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు సామర్థ్యాన్ని పెంచి అదనంగా నీటి సౌకర్యము కల్పించాలని తెలిపారు.
- కర్నూలు జిల్లాలోని 7 నియోజకవర్గాలకు 150 టిఎంసి నీరు అవసరముండగా కేవలం 10 టిఎంసి నీరు మాత్రమే అందుతున్నదని దీనివల్ల కర్నూలు జిల్లా రైతులు వ్యవసాయరంగంలో పూర్తిగా నష్టపోతున్నారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు.