గోనెగండ్ల (కర్నూలు జిల్లా): ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం నిర్వహించే “ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు” కార్యక్రమాన్ని గోనెగండ్ల మండల కేంద్రంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
బైలుప్పల గ్రామానికి చెందిన రైతు దాసరి జాంబయ్యకు చెందిన 2.70 ఎకరాల భూమి గత 18 ఏళ్లుగా పొరపాటున ఇనాం జాబితాలో ఉంది. ఈ రికార్డులను వెంటనే సరిచేసి, ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతుకు ఆన్లైన్ అడంగల్ అందజేశారు.
కలెక్టర్ డా. ఏ. సిరి మీడియా తో మాట్లాడుతూప్రతి శుక్రవారం స్వీకరించే వినతులపై తదుపరి శుక్రవారం రోజు సమీక్ష నిర్వహించి, జవాబుదారీతనంతో సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. 22-ఏ నిషేధిత జాబితా, రీ-సర్వే వ్యత్యాసాలు, ఇనాం భూముల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ వెంకటనారాయణమ్మ, ఆదోని ఆర్డీఓ అరుణాదేవి, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.