కర్నూలు జిల్లా ఆదోని బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంక్, సంతెకుడ్లూరు సమ్మర్ స్టోరేజి ట్యాంకుల నాసిరకం పనుల అవినీతి పై సీబీఐ విచారణ జరిపి నిందితులను శిక్షించాలని, సదరు ట్యాంకుల రిపేరికి నిధులను అవినితి పరుల నుంచే కక్కించాలని ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథిని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున డిమాండ్ చేశారు.
యం హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను మోడీ గారి శిష్యుడినని చెప్పుకునే ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి తలుచుకుంటే సీబీఐ విచారణ వేయించటం పెద్ద పనేమీ కాదని అన్నారు. బసాపురం మరియు సంతెకుడ్లూరు యస్ యస్ ట్యాంకులు దెబ్బతినటంతో ఆదోని పట్టణము మరియు గ్రామాలకు తీవ్రమైన నీటి సమస్య నెలకొన్నది. ఇంతటి పెను సమస్యకు కారకులైన నాయకులు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు మరియు అధికారులు చట్టం నుంచి తప్పించుకుని స్వేచ్ఛగా తిరగటం ఆదోని ప్రజలను అవమానించటమే అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవినితి పై చర్యలు తీసుకోకపోతే ఆదోనిలో అవినీతి చేసినా పట్టించుకునే వారు ఉండరు, ఎలాంటి శిక్ష పడకుండా క్షేమంగా ఉండవచ్చు అనే తప్పుడు సంకేతాలు వెళతాయి.
కాబట్టి ఆదోని ఎమ్మెల్యే గత పాలకుల అవినీతి అక్రమాల పై కేసులు పెట్టి ఆదోనిలో అవినీతి అంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి పై ఎమ్మెల్యే కేసులు పెట్టకపోతే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించి కేసులు పెట్టటానికి సిద్ధంగా ఉన్నామని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున ప్రకటించారు.
ఈ సమావేశంలో వసీమ్ సాహెబ్, హసన్, ఆబిద్ అలి పాల్గొన్నారు.