ప్రేమించిన యువతికి వేరొకరితో పెళ్లి అయ్యిందన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదోని – కుప్పగల్లు రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది.
రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోని మండలం గనేకల్ గ్రామానికి చెందిన పాండవగల్లు శివరాజ్ (20) బుధవారం (జూలై 29) రాత్రి ఇసవి-కుప్పగల్లు రైల్వే స్టేషన్ల మధ్య కేఎమ్ నెంబర్ 504/23-21 వద్ద అప్లైన్ రైల్వే ట్రాక్పై రైలు కింద పడి మృతి చెందాడు. బిటిపిటి గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతుడి తండ్రి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, అప్పటి నుంచి శివరాజ్ జులాయిగా తిరుగుతూ తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తన అక్క కూతురిని ఇష్టపడగా, అతని ప్రవర్తన నచ్చని అక్క తన కుమార్తెను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివరాజ్ గుర్తుతెలియని రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.