అదోని: తన భార్యను అత్తగారింటి నుండి పంపడం లేదన్న మనస్తాపంతో ఒక యువకుడు ఏకంగా రేడియో టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు మూడు గంటల పాటు హైడ్రామా నడిచిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో యువకుడు క్షేమంగా కిందకు దిగాడు.

అసలేం జరిగింది?.. ఆలూరు నియోజకవర్గం, చిప్పగిరి మండలం నేమకల్ గ్రామానికి చెందిన సురేంద్ర, అదే గ్రామానికి చెందిన నాగేశ్వరి అనే యువతిని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పండగ కోసమని నాగేశ్వరిని ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. పండగ ముగిసినా తన భార్యను తిరిగి కాపురానికి పంపకపోవడంతో సురేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
టవర్ ఎక్కి హల్చల్ : శనివారం అదోనిలోని రేడియో టవర్ ఎక్కిన సురేంద్ర, తన భార్యను పంపకపోతే కిందకు దూకేస్తానని బెదిరించాడు. మూడు గంటల పాటు టవర్ పైనే ఉండి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న సీఐ రాజశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసుల హామీతో శాంతించిన యువకుడు .. సీఐ రాజశేఖర్ టవర్ కింద నుండి సురేంద్రతో మాట్లాడి నచ్చజెప్పారు. “నీ భార్యను, మీ అత్తమామలను స్టేషన్కు పిలిపించి మాట్లాడతాం. మీ ఇద్దరినీ కలిపి కాపురానికి పంపించే బాధ్యత నాది” అని సీఐ హామీ ఇవ్వడంతో సురేంద్ర శాంతించి కిందకు దిగివచ్చాడు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం భార్యపై ఉన్న ప్రేమతోనే ఆవేశంలో ఇలాంటి పని చేశాడని సీఐ మీడియాకు వివరించారు