రాయలసీమ ప్రాంతంలో వక్ఫ్ బోర్డ్ భూములు, ఆస్తులు అత్యధికంగా ఉన్న కారణం దృష్ట్యా వక్ఫ్ బోర్డు పదవులు, బాధ్యతల్లో రాయలసీమ నాయకులకు, మేధావులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ మాట్లాడుతూ రాయలసీమలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కావడం, ఈ భూముల విడుదలకు ఎవరూ కృషి చేయకపోవడంతో ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు, పేదలను ఆదుకోవడానికి ఉపయోగపడవలసిన వక్ఫ్ ఆస్తులు కొందరు కబ్జా కోరులు, అవినీతిపరులు అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకై స్థానికులైన రాయలసీమ నాయకులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించారు. రాయలసీమలో వక్ఫ్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయమైన ఈ డిమాండ్ల పట్ల ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందిస్తారని తెలిపారు.