Connect with us

News

భూసమస్యలపై సదస్సులు.. భూ కష్టాలూ 90 రోజుల్లో పరిష్కారం

Published

on

అమరావతి:
◆ 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు: రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా..
◆ 45 రోజుల పాటు నిర్వహణ ..
◆ మరో 45 రోజుల్లో పరిష్కారం..
◆ భూ కబ్జాలు, రీ సర్వేతో వచ్చిన కష్టాలూ చెప్పుకోవచ్చు..
◆ ప్రజల నుంచి 5 కేటగిరీల్లో పిటిషన్ల స్వీకరణ..
◆ ఆర్టీజీఎస్‌ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ..
◆ ఎవరెవరు పాల్గొంటారు గ్రామ సదస్సులో…
◆ 1.తహసీల్దార్‌, 2.రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, 3.గ్రామ రెవెన్యూ అధికారి, 4. మండల సర్వేయర్‌, 5. దేవదాయ, వక్ఫ్‌ శాఖల ప్రతినిధులు, 6. రిజిస్ట్రేషన్‌శాఖ అధికారి, 7.అటవీ శాఖ అధికారి పాల్గొంటారు.
◆ సున్నితమైన భూసమస్యలపై సదస్సులు నిర్వహిస్తున్నందున కార్యక్రమం పూర్తయ్యేవరకు పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తారు..

రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా

గత ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టిన భూ వివాదాల చిచ్చును పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించింది. ‘ప్రజల వద్దకే పాలన’ తరహాలో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ అధికారులు భూ సమస్యలను తెలుసుకుంటారు. ఆగస్టు 15వ తేదీ నుంచి 45 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మరో 45 రోజుల్లో సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తారు. ఉద్దేశపూర్వకంగా వెబ్‌ల్యాండ్‌లో చిన్న, చిన్న మార్పులు చేసి ప్రజలను హింసించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక స్వీకరిస్తోన్న వినతిపత్రాల్లో సగానికిపైగా భూ వివాదాలపైనే ఉంటున్నాయి. ప్రభుత్వం తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. 45 రోజులపాటు ఊరూరు తిరిగి అధికార యంత్రాంగాన్ని మోహరించి ఎక్కడికక్కడే సమస్యలు తెలుసుకోవడం, ఆ తర్వాత 45 రోజుల్లో వాటికి పరిష్కారం చూపడం… ఇదే ప్రస్తుత టార్గెట్‌. ఈ నెల 15న మంత్రులు లాంఛనంగా గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత 16నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు అంటే 45 రోజుల పాటు సదస్సులు నిర్వహించనున్నారు.

దాచిన ఫోటో

జిల్లాలు, మండలాల వారీగా గ్రామాల్లో సదస్సుల నిర్వహణ తేదీలను 13నాటికే ఖరారు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. సదస్సుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఓ సీనియర్‌ ఐఏఎ్‌సను ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. జేసీ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ సదస్సుల్లో జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్‌, సభ్యులు, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొనేలా కలెక్టర్‌లు తగిన చొరవ తీసుకోవాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు.

దాచిన ఫోటో

◆ సదస్సుల్లో ఏం చేస్తారంటే..
గ్రామ రెవెన్యూ సదస్సుకు రెండు రోజుల ముందే ప్రభుత్వం గ్రామ రెవెన్యూ మ్యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల మ్యాప్‌లను ప్రకటిస్తుంది. సదస్సులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, అటవీ, దేవదాయ, వక్ఫ్‌ శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు. భూ కొలతల్లో తేడాలు, సర్వేనెంబర్లలో మార్పులు, వారసత్వం పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రికార్డుల్లో నమోదైన తప్పులు, భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, అసైన్డ్‌, చుక్కల భూముల పరాధీనం వంటి తదితరాలపై బాధితుల నుంచి పిటిషన్లు తీసుకుంటారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నా యో పరిశీలిస్తారు. అడంగల్‌, పహనీ, ఆర్‌ఓఆర్‌, 1బీ రిజిస్టర్‌, 22(ఏ) జాబితాలను అందుబాటులో ఉంచుతారు. వాటిపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. తహసీల్దార్ల నేతృత్వంలో అవసరమైతే భూములను పరిశీలన చేస్తారు. రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఆర్‌ఓఆర్‌ రికార్డును ప్రజల సమక్షంలో చదివి వినిపించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు జగన్‌ బొమ్మలున్న పాస్‌పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. జగన్‌ బొమ్మలున్న పాస్‌ పుస్తకాలను తహసీల్దార్లు ధ్వంసం చేయాలని రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ సిసోడి యా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గ్రామంలో జగన్‌ పేర్లు, బొమ్మలతో సర్వేరాళ్లు ఉంటే, వాటిపై పేర్లను చెరిపివేయాలని నిర్దేశించారు.

దాచిన ఫోటో

◆ ఐదు కేటగిరీలుగా..
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఐదు రిజిస్టర్లలో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 1.మ్యుటేషన్‌, 2.కౌలు రైతు కార్డులు(ఎల్‌ఈసీ), 3.భూమి వివాదాలు, 4.భూ ఆక్రమణ, 5.నిషేధ జాబితా 22(ఏ) గోల్‌మాల్‌ రిజిస్టర్లను నిర్వహిస్తారు. వీటిలో నమోదుచేసి, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. వీటిని ఆర్‌టీజీఎస్‌ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. ఫిర్యాదు ఇచ్చిన ప్రజలకు వెంటనే ఓ రశీదు ఇస్తారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ అనేది ప్రభుత్వం చేపట్టిన పెద్ద టార్గెట్‌. దాన్ని విజయవంతం చేయాలంటే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి. అందుకే ప్రజాప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతు నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, భూ సమస్యలపై పనిచేస్తోన్న ఎన్‌జీవోలను పిలిచి సదస్సుల ఆవశ్యకతను తెలియజేయాలని, ఈ సదస్సులకు విస్త్రత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. జిల్లా, డివిజన్‌, మండల, గ్రామంవారీగా రెవెన్యూ సదస్సుల నిర్వహణ, వాటి లక్ష్యాలు తెలిపేలా ప్రచారం చేయాలని నిర్దేశించింది.

◆ 90 రోజుల టార్గెట్‌: ఆర్పీ సిసోడియా..
ఈ నెల 15నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి పిటిషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత మరో 45 రోజుల్లో అంటే నవంబరు 15 నాటికి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. పిటిషన్ల స్వీకరణ, పరిష్కారం 90 రోజుల్లోనే పూర్తిచేయాలనేది లక్ష్యం. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది. పిటిషన్ల స్వీకరణ, పరిష్కారంపై రోజువారీగా సమీక్ష చేయనున్నారు. అర్జీదారుకు ఫోన్‌చేసి పరిష్కారంపై వివరించాలని ఆదేశించారు. పర్యవేక్షణకు ఆర్టీజీఎస్‌ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.

◆ ప్రజల వద్దకే అధికారులు..
రెవెన్యూ సదస్సుల పేరిట ఐదేళ్ల తర్వాత కీలక ప్రభుత్వ శాఖలు ప్రజల వద్దకు వెళ్లనున్నాయి. ఇది ప్రజల వద్దకు పాలనే అని సీనియర్‌ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇంతకు ముందు అధికారుల వద్దకు ప్రజలు వెళ్లి గోడు చెప్పుకొనేవారు. దీంతో అధికారి స్వీకరించే పరిస్థితిని బట్టి పరిష్కారం ఉండేది. కానీ, ఇప్పుడు ప్రజల భూ వివాదాలు వినడానికే ఐదారుశాఖల అధికారులతో కూడిన బృందాలు రోజంతా గ్రామంలో మకాం వేయబోతున్నాయి. ఇందు లో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ ఉంటోంది.

News

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు  ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Continue Reading

News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మృతదేహాన్ని తరలిస్తున్న ఫోటో
Continue Reading

News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

Published

on

ఎమ్మిగనూరు, మే 13:

లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..

ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. సోమన్న, ఏసీబీ డీఎస్పీ

Continue Reading
News2 weeks ago

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

News2 weeks ago

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

News1 month ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News2 months ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News2 months ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News2 months ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News3 months ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

News3 months ago

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

Trending