బాలికల రక్షణ మరియు సంక్షేమము కమిటీ మొదటి సమావేశం

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి నగర్ 35వ వార్డులో బాల్య వివాహాల నిర్మూలన, బాలికల సంరక్షణ కోసం 35వ వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ అధ్యక్షతన సచివాలయ మహిళా వెల్ఫేర్ సెక్రటరీ పవిత్ర ఆధ్వర్యంలో మొదటి సమావేశం ఏర్పాటుచేసుకుని 35వ వార్డులో చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం, ఆడపిల్లలను బడికి పంపకుండా కూలీ పనులకు పంపించడం చాలా ఎక్కువగా ఉన్న విషయాలపైన బాలికల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రస్తుత నాగరిక ప్రపంచంలో బాలికలు తమ జీవితాన్ని వారి పిల్లల జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి చదువు యొక్క అవసరాన్ని తెలియచేయడమే కాకుండా చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల వచ్ఛే వివాహానంతరం సంసారం, సంతానం వల్ల కలిగే ఇబ్బందులు మొదలగు విషయాలపైన ప్రతి 15రోజులకు ఒక తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని మొదటి సమావేశములో తీర్మానం చేయడమైనదని కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ తెలిపారు.ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ మా వార్డులో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం వలన ఆడపిల్లల తల్లిదండ్రులకు సరియైన అవగాహన లేకపోవడం వలన పదమూడు, పదునాలుగు సంవత్సరాలలో పెళ్ళిళ్ళు చేస్తున్నారని అందువల్ల ఆడపిల్లల చిన్న వయసులోనే గర్భధారణ జరగడం, తద్వారా ప్రసవసమయములో చాలా మంది రక్తహీనత వలన ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారని వీటన్నింటికీ మా చేతనైన పరిష్కారం చూపడము కోసము మేము ఈ కమిటీ చేసుకున్నామని తెలిపారు.ఈ కమిటీలో హైస్కూల్ టీచర్ ప్రసన్నకుమారి,ఎఎన్నెమ్ ఈరమ్మ, అంగన్వాడీ సూపర్ వైజర్,వసంతమ్మ, సామాజిక కార్యకర్త మరియు కవయిత్రి జంగం స్వయంప్రభ, అంగన్వాడీ కార్యకర్తలు గ్రేసమ్మ, శ్యామల, పొదుపు ఆర్పీలు, ఫాతిమా, కళావతిని అలాగే యశోద,షాబీర మొదలైన వారిని సభ్యులుగా పనిచేయుటకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని వెల్లాల లలితమ్మ తెలిపారు.