కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపిన వివరాల ప్రకారం… ఆదోనిలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన ఉపేంద్ర (తండ్రి: లక్ష్మన్న) అనే యువకుడు జులై 26వ తేదీ (ఆదివారం) రాత్రి 10 గంటల సమయంలో ఆదోని – నగరూరు రైల్వే స్టేషన్ల మధ్యన ఉన్న కేఎం నంబర్ 492/23-25 వద్ద అప్లైన్ రైల్వే ట్రాక్పై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించి రైలు (Train No. 11301) లోకో పైలట్ అందించిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతుడు ఉపేంద్ర తండ్రి లక్ష్మన్నకు ఒక్కడే కుమారుడు కావడం, ఈ నెల (జులై) 9వ తేదీనే అతనికి వివాహం జరగడం విశేషం. పెళ్లయిన కొన్ని రోజులకే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంతో ఇంద్రానగర్ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని, ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని హెడ్ కానిస్టేబుల్ శివ రామయ్య తెలిపారు.