ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయంఅని టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బుడేకల్ ఏరియాలో శుక్రవారం విస్తృతంగా ‘డోర్ టు డోర్’ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ‘సూపర్ సిక్స్’ పథకాల అమలుతో పాటు పింఛన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్న క్యాంటీన్లు, దీపం పథకం, మెగా డీఎస్సీ వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తున్నామని తెలిపారు.
ఈ ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి గడపకూ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ, స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ రామకృష్ణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, నాయకులు జిందే శంకర్, రంగన్న, రామస్వామి, కృష్ణారెడ్డి, క్లస్టర్-6 రవి, సతీష్, అల్తాఫ్, నాగేష్, మరి, నాగరాజ్, ఉదయ్ శంకర్, శిక్షావలి తదితరులు పాల్గొన్నారు.