News
తెలుగు రాష్ట్రాలకు నేడు కీలకమైన రోజు
పదేళ్ళు గడిచినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య
విభజన సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. షెడ్యూల్ 9 లోనీ 89 ప్రభుత్వ కంపెనీ లు & కార్పొరేషన్లు, షెడ్యూల్ 10 లోనీ 107 రాష్ట్ర సంస్థలు ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆస్తుల విభజన పంపకాలు మాత్రం జరగలేదు. ఇవి తెలంగాణ లో 91% ఆంధ్రాలో 9% ఉన్నాయి..
వీటి ఆస్తుల విలువ దాదాపు లక్షన్నర కోట్లు పైనే. విభజన చట్టం ప్రకారం పంపకాలు సరిగా జరిగితే. ఆంధ్రప్రదేశ్ కి 58% తెలంగాణకి 42% చట్ట పరంగా దక్కాలి. కనీసం ఆంధ్రప్రదేశ్ కు అక్షరాల 85 వేల కోట్లు లాభం. విద్యుత్ బకాయిల సంగతి తెలిసిందే. అంతర్రాష్ట్ర జలవివాదాలకు స్వస్తి పలకలేదు.. కొన్ని జలప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగలేదు. నాడు చంద్రబాబు నాయుడు , కేసిఆర్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి కొంతవరకూ కట్టుబడి అడుగులు వేస్తే. ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన గత ప్రభుత్వాలు నీటి యుద్దాలు సృష్టించి. రెండు తెలుగు రాష్టాల సమస్యలు జఠిలం చేశారు. అవసరం మేరకు రాష్టాల సమస్యలు రాజకీయం కొరకు వాడుకున్నారు. నేడు తాజాగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రజా భవన్ వేదిక గా భేటీ అనగానే సామాన్య ప్రజలు అంచనాలు రెండు రాష్టాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడతాయి అని భావిస్తున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం అయినా మరి కొన్ని వివాదాలు అంత సులభంగా పరిష్కారం అవుతాయి అని భావించడం లేదు. కాస్త సమయం పట్టొచ్చు. న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య మంచి సంబంధాలు ఉన్నపటికీ..
వారు ఇద్దరూ రెండు రాష్ట్రాలకు ప్రతినిధులు. అయిననూ అందరం సోదరులమే కదా అని ఇద్దరూ సమస్యల విషయం లో పట్టువిడుపులు ప్రదర్శించినా, చంద్రబాబు నాయుడు కొన్ని సమస్య పై తగ్గితే జగన్ రెడ్డి చిచ్చు రేపుతారు. రేవంత్ రెడ్డి తగ్గితే కేసిఆర్ చిచ్చు పెడతారు. కొందరు ఉద్యమకారులు నీటివివాదాలు విషయం లో అనుభవజ్ఞులు మళ్ళీ కెసిఆర్, జగన్ యాక్టివ్ అవుతారు జనాన్ని రెచ్చగొడతారు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. కెసిఆర్ ను, జగన్ రెడ్డి నీ జనాలు చూసి చూసి, విసుగు చెంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు రెచ్చగొడితే ప్రజలు. రెచ్చి పోయి. విద్వేషాలు పెంచుకుంటారా అంటే. మిలియన్ డాలర్ ప్రశ్న? వీరి ఇద్దరికి ( కెసిఆర్ & జగన్ ) పరిష్కారం కన్నా వారి మనుగడ & రాజకీయం ప్రయోజనాలు ముఖ్యం. ఈ పరిస్థితుల్లో నేడు కీలకమైన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు దాదాపు కీలక మైన సమస్య లు పరిష్కారం అవుతాయి అని ఆశ లేదు. సమస్యలు పరిష్కారం కావు అని నిరాశా లేదు. కేవలం ఉన్న నమ్మకం. ఒక ప్రశాంతమైన వాతావరణం లో…. సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు & రేవంత్ రెడ్డి కీలక సమస్యలు పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నారు.
News
భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త
అదోని: తన భార్యను అత్తగారింటి నుండి పంపడం లేదన్న మనస్తాపంతో ఒక యువకుడు ఏకంగా రేడియో టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు మూడు గంటల పాటు హైడ్రామా నడిచిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో యువకుడు క్షేమంగా కిందకు దిగాడు.

అసలేం జరిగింది?.. ఆలూరు నియోజకవర్గం, చిప్పగిరి మండలం నేమకల్ గ్రామానికి చెందిన సురేంద్ర, అదే గ్రామానికి చెందిన నాగేశ్వరి అనే యువతిని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పండగ కోసమని నాగేశ్వరిని ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. పండగ ముగిసినా తన భార్యను తిరిగి కాపురానికి పంపకపోవడంతో సురేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
టవర్ ఎక్కి హల్చల్ : శనివారం అదోనిలోని రేడియో టవర్ ఎక్కిన సురేంద్ర, తన భార్యను పంపకపోతే కిందకు దూకేస్తానని బెదిరించాడు. మూడు గంటల పాటు టవర్ పైనే ఉండి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న సీఐ రాజశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసుల హామీతో శాంతించిన యువకుడు .. సీఐ రాజశేఖర్ టవర్ కింద నుండి సురేంద్రతో మాట్లాడి నచ్చజెప్పారు. “నీ భార్యను, మీ అత్తమామలను స్టేషన్కు పిలిపించి మాట్లాడతాం. మీ ఇద్దరినీ కలిపి కాపురానికి పంపించే బాధ్యత నాది” అని సీఐ హామీ ఇవ్వడంతో సురేంద్ర శాంతించి కిందకు దిగివచ్చాడు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం భార్యపై ఉన్న ప్రేమతోనే ఆవేశంలో ఇలాంటి పని చేశాడని సీఐ మీడియాకు వివరించారు
News
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

