News
సెప్టెంబర్ 30వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించాలి కలెక్టర్ ఆదేశం
కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ వారు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద వెనుకబడిన ప్రాంతాల్లో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్యం, వ్యవసాయం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, మహిళ శిశువుల సంక్షేమం సంబంధిత 6 అంశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలంలో కెవిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం సంపూర్ణత అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సంవత్సరం జనవరిలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం తీసుకొని రావడం జరిగిందన్నారు. భారత ప్రభుత్వం ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం అమలు చేసేందుకు గాను 500 వెనుకబడిన మండలాలను ఎన్నుకోవడం జరిగిందని అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 15 మండలాలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. 15 మండలాలలో కర్నూలు జిల్లా నుండి మద్దికేర, చిప్పగిరి, హోళగుంద మండలాలు ఎన్నిక చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
సంపూర్ణత అభియాన్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమం మొదటి ఫేస్ లో నీతి ఆయోగ్ సంస్థ వారు గుర్తించిన 6 అంశాల్లో సెప్టెంబర్ 30 వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.

సెప్టెంబర్ మాసంలోపు నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం సాధించినట్లైతే మిగిలిన 33 అంశాల్లో బ్లాక్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి 3 ఇండికేటర్లు, ఐసిడిఎస్ శాఖ కి సంబంధించి 1 ఇండికేటర్, వ్యవసాయ శాఖ కి సంబంధించి 1 ఇండికేటర్, డి ఆర్ డి ఎ కి సంబంధించి 1 ఇండికేటర్ మొత్తం 6 ఇండికేటర్లు (అంశాలు) ఉన్నాయన్నారు. వ్యవసాయ శాఖ మినహాయించి మిగిలిన అంశాల్లో ఇప్పటికే 80 శాతం పురోగతి సాధించామని, సెప్టెంబర్ 30 వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

గర్భిణీ స్త్రీల యాంటినేటల్ రిజిస్ట్రేషన్ లో 92 శాతం పురోగతి సాధించామని, సెప్టెంబర్ లోపు 100 శాతం రిజిస్ట్రేషన్ లు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్స్ మిస్ కాకుండా చూసుకోవాలన్నారు.
డయాబెటిక్ స్క్రీనింగ్ కి సంబంధించి మండలంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా వైద్య ఆరోగ్య శాఖ వారు వెళ్లి హైపర్ టెన్షన్ డయాబెటిస్ అంటే షుగర్ మరియు బిపి టెస్ట్ లు అందరికీ కూడా స్క్రీన్ చేయడం జరుగుతుందన్నారు. ఎవ్వరికైనా సమస్య ఉంటే సంబంధిత వారికి మెడిసిన్స్ కూడా ఇస్తారన్నారు. కనుక దయచేసి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేయించుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు.

సప్లిమెంటరీ న్యూట్రిషన్ కి సంబంధించి గర్భిణీ మహిళలు ఎవ్వరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సంబంధిత గర్భిణీ స్త్రీలకు ప్రతినెలా హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడంతో పాటు విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ అంశాంలో ఇప్పటికే 100 శాతం పురోగతి సాధించామని, పురోగతి శాతం తగ్గకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు..
వ్యవసాయ శాఖ కి సంబంధించి సాయిల్ టెస్టింగ్ చేయడం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఏదైనా సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు.
సాయిల్ లో ఎంత ఎరువులు కలపాలి, నైట్రోజన్ నిష్పత్తి ఎంత ఉండాలని కనుకోవాలంటే సాయిల్ టెస్టింగ్ జరగాలన్నారు. సాయిల్ టెస్టింగ్ అంశంలో పురోగతి సాదించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు..

జడ్పిటిసి, ఎంపీపీ, ఇతర ప్రజాప్రతినిధిలు మద్దికేర మండలంలో కాలేజీ లేదనే విషయాన్ని తన దృష్టికి తీసుకొని వచ్చారని ఉన్నత అధికారులతో చర్చించి జూనియర్ కానీ డిగ్రీ కాలేజ్ గాని తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు మాట్లాడుతూ అస్పిరేషనల్ బ్లాక్ (సంపూర్ణత అభియాన్) కార్యక్రమాల ద్వారా గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి భూసార పరీక్ష కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన భూసార పరీక్షలు నిర్వహించి లాభసాటి పంట పండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అస్పిరేషనల్ బ్లాక్ తరహాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు తమ వంతు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.

కేంద్ర నితీఅయోగ్ అధికారి శృతి సబర్వాల్ మాట్లాడుతూ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం క్రింద సంపూర్ణత అభయాన్ కార్యక్రమంలో పొందుపరిచిన 6 అంశాల్లో 100 శాతం పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు..
అనంతరం సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం, సంపూర్ణత అభియాన్, పోషణ్ అభియాన్, ఐసిడిఎస్ ద్వారా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యక్రమాలు, వ్యవసాయం శాఖ వారు ఏర్పాటు చేసిన భూసార పరీక్ష మట్టి నమూనా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ అభియాన్ కిట్స్ ను కలెక్టర్, పత్తికొండ శాసనసభ్యులు, కేంద్ర నితీఅయోగ్ అధికారి శృతి సబర్వాల్ పంపిణీ చేశారు.

యాస్పిరేషనల్ బ్లాక్ కు సంబంధించి ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ పోస్టర్ పై కలెక్టర్, పత్తికొండ శాసనసభ్యులు, ఢిల్లీ నీతిఅయోగ్ అధికారి శృతి సబర్వాల్ సంతకాలు చేశారు.

అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చదివిన పాఠశాలలో విద్యను అభ్యసించడానికి అర్హత సాధించిన విద్యార్థి వినయ్ కుమార్ ను కలెక్టర్ పి.రంజిత్ బాషా, పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు శాలువతో సత్కరించారు. అదే విధంగా సదరు తరగతిలో అతను టీమ్ లీడర్ గా ఉండటం పట్ల విద్యార్ధిని అభినందించారు.

తొలుత డిఆర్డిఎ పిడి, వైద్య ఆరోగ్య శాఖ అదనపు డిఎమ్హెచ్ఓ, వ్యవసాయ శాఖ అధికారులు వారి శాఖల నుండి చేపట్టిన పురోగతి వివరాల గురించి వివరించారు..సంబంధిత అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పత్తికొండ ఆర్డిఓ రామలక్ష్మి, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, డిఆర్డిఎ పిడి సలీం భాష, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, మద్దికెర గ్రామ సర్పంచ్ సుహాసిని, ఎమ్ పిపి అనిత యాదవ్, జెడ్పిటిసి మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News
సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:
- వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
- ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
- తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
News
పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
ఆదోని, ఫిబ్రవరి 18:
ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే? కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్కు చేరుకుని డ్రైవర్ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
News
నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.
ఘటన వివరాలు:
పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
భారీగా ఊట ధ్వంసం:
పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
నిందితుడి గుర్తింపు:
పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

-
News2 weeks agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News2 weeks agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News2 weeks agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News2 weeks agoపోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News2 weeks agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News1 week agoసహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
-
News2 weeks agoనాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
