News
జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు..!
GST collection: దిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో (GST collections) సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్ నెలకు గానూ రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి..
గతేడాది ఏప్రిల్లో రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు 12 శాతం మేర వృద్ధి నమోదైంది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఏప్రిల్ నెలకు గానూ రూ.1,87,035 కోట్లు వసూలు అవ్వగా.. అందులో సీజీఎస్టీ కింద రూ.38,440 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.47,412 కోట్లు, రూ.89,158 కోట్ల మేర ఐజీఎస్టీ (రూ.34,972 కోట్ల దిగుమతైన వస్తువుల మీద), సెస్సు కింద రూ.12,025 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ (Finance ministry) శాఖ తెలిపింది. 2022-23 మొత్తం ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.18.10 లక్షల కోట్లు వసూలయ్యాయని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 22 శాతం అధికమని కేంద్రం తెలిపింది.
రికార్డు స్థాయిలో జిఎస్టీ వసూళ్లు కావడం దేశ ఆర్థిక వ్యవస్థకు శుభవార్తగా ప్రధాన మంత్రి మోదీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. పిఐబి ప్రకటనను ట్విట్టర్లో కోడ్ చేస్తూ తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ…జిఎస్టీ వసూళ్లు పెరగడం విజయానికి సంకేతమని పేర్కొన్నారు..
ఏపీ 6.. తెలంగాణ 13 శాతం వృద్ధి..
తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు కూడా స్వల్పంగా పెరిగాయి. గతేడాది ఏప్రిల్లో రూ.4067 కోట్ల వసూళ్లు సాధించిన ఆంధ్రప్రదేశ్.. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.4329 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే వసూళ్లు 6 శాతం మేర పెరిగాయి. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది రూ.4,955 కోట్లు సాధించగా.. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.5,622 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు నమోదు చేసింది..
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


News
ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్
ఆదోనిలో అధికారులు మెరుపు దాడులతో విరుచుకుపడ్డారు. సామాన్యుడి పొయ్యి వెలగాల్సిన డొమెస్టిక్ గ్యాస్ను.. హోటళ్లలో వాడుతూ సొమ్ము చేసుకుంటున్న గ్యాస్ మాఫియా గుట్టు రట్టు చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో హోటల్ యజమానుల ఆటలు సాగనివ్వమని సివిల్ సప్లై అధికారులు తేల్చి చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి, తక్కువ ధరకు వచ్చే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారనే ఫిర్యాదుతో అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో DSO రాజా రఘువీర్ నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు పట్టణంలోని గల్లీ గల్లీని జల్లెడ పట్టాయి. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, చిన్నా చితకా హోటళ్లు అని తేడా లేకుండా అధికారులు సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తనిఖీ చేసిన 88 హోటళ్లలో 107సిలిండర్లు సీజ్ చేసి వారిపై ఎసెన్షియల్ కమ్యూడిటి యాక్ట్ సెక్షన్ 6ఎ క్రింద కేసు నమోదు చేశారు. గృహ వినియోగ గ్యాస్ను వ్యాపారాలకు వాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్ఓ రాజా రఘువీర్.
ప్రస్తుతానికి ఈ దాడులు ఆదోని హోటల్ యజమానుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అక్రమంగా సిలిండర్లు దాచిన వారు ఇప్పుడు వాటిని ఎక్కడ దాచుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరి అధికారులు ఈ జోరును ఇలాగే కొనసాగిస్తారో లేదో చూడాలి..



