News
ఒక్కసారే అవకాశం.. ఇది వరకులా ఎక్కువ ఛాన్స్లు ఉండవ్.. సీఎం చంద్రబాబు
ఏ అధికారి ఎక్కడ సరిపోతారో వారినే అక్కడ నియమించామని భావిస్తున్నాను. అందుకోసం చాలా కసరత్తు చేశాం. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను.
బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తా… లేకపోతే కొత్తవారిని చూసుకుంటా
కేంద్రం నుంచి వీలైనంతగా నిధులు తేవడంపై దృష్టి పెట్టండి
అధికారులకు సీఎం స్పష్టీకరణ
బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పాల్గొన్న మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, లోకేశ్, కొల్లు రవీంద్ర..
అమరావతి: ఏ అధికారి ఎక్కడ సరిపోతారో వారినే అక్కడ నియమించామని భావిస్తున్నాను. అందుకోసం చాలా కసరత్తు చేశాం. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు నన్ను నమ్మండి. కలిసి ముందుకెళదాం. అంచనాల్ని అందుకునేలా అందరూ పనిచేయాలి.
గతంలో కొందరు అధికారుల పనితీరు అంత బాగా లేకపోయినా, ఫలితాలు కనిపించకపోయినా చూసీచూడనట్లు ఉండేవాడిని. మరిన్ని అవకాశాలు ఇచ్చేవాడిని. ఇకపై అలా ఉండదు. అధికారుల పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షిస్తాను.
ఒకసారే అవకాశమిస్తాను. దాన్ని అందిపుచ్చుకుని బాగా పనిచేసినవారిని మరింతగా ప్రోత్సహిస్తాను. పని చేయనివారికి థ్యాంక్స్ చెప్పేసి కొత్తవారిని చూసుకుంటాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు.

బుధవారం సాయంత్రం ఆయన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సచివాలయంలోని ఐదో బ్లాక్లో సమావేశమయ్యారు. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. అధికారులతో ఇంత విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.
వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న తీరు, ప్రాధాన్యతలను ఆయన స్పష్టంగా తెలియజేశారు. అధికారుల నుంచి ఎలాంటి పనితీరు ఆశిస్తున్నదీ విస్పష్టంగా చెప్పారు.
పనులు చేయడానికి డబ్బుల్లేవని చెప్పొద్దని, నిధులులేకుండానే చేసే పనులు చాలా ఉంటాయని, వాటిపై దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు.
కేంద్రం నుంచి వీలైనన్ని మార్గాల్లో నిధులు తెచ్చుకోవాలి
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల్లో రాష్ట్రానికి ఏ మేరకు తెచ్చుకోగలమన్నదానిపై ఆయా విభాగాల అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని చంద్రబాబు తెలిపారు. *వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్), ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) చేపట్టే ప్రాజెక్టులు… ఇలా కేంద్రం నుంచి ఎలా వీలైతే అలా నిధులు రాబట్టుకోవడమే ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు, మూడు నెలల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆ కోణంలోనే ఉండాలన్నారు.
కేంద్రం నుంచి శాఖల వారీగా రాష్ట్రానికి అవసరమైన సాయం తెచ్చుకునేందుకు ఇప్పటికే ఎంపీలు, మంత్రులతో బృందాన్ని ఏర్పాటు చేశామని.. రాష్ట్రస్థాయిలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు ఒక బృందంగా పనిచేస్తూ, ఎంపీలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.
అధికారులు మానవీయ కోణంలో పనిచేయాలి.
అధికారులు అన్ని సార్లూ రూల్స్ పట్టుకుని వేళ్లాడటం సరికాదని, కొన్ని సందర్భాల్లో ప్రజలకు మేలు చేసేందుకు మానవీయ కోణంలో ఆలోచించాలని చంద్రబాబు సూచించారు.

ఓట్లు వేరు. ప్రజలకు మంచి చేయడం వేరు. ప్రతి పనికీ రాజకీయ ప్రయోజనం ఉండకపోవచ్చు.
కానీ మంచి చేశామనే తృప్తి ఉంటుంది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అంత మంది రోడ్డెక్కడానికి కారణం… అంతకు ముందు నేను చేసిన మంచే. మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. ప్రజలు సాయం కోరి వస్తే.. దాన్ని ఎలాగైనా పరిష్కరించేలా అధికారుల ఆలోచనలు ఉండాలి.
బ్యూరోక్రటిక్ కోణంలో కాకుండా మానవీయ కోణంలో పనిచేయాలి’ అని స్పష్టం చేశారు.
పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యం
రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ), పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం (పీ4) విధానాల్ని అనుసరిస్తామని చంద్రబాబు తెలిపారు.

1995లో ఇంజినీరింగ్ కాలేజీల్ని నెలకొల్పాలి ఆనుకున్నప్పుడు ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే… ప్రైవేటు రంగంలో ప్రోత్సహించామని గుర్తు చేశారు. అప్పట్లో ఆ చొరవ తీసుకోబట్టే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం నలుమూలలా వేల సంఖ్యలో సాఫ్ట్వేర్ నిపుణులు ఉన్నారని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 1-2 శాతం మంది, అట్టడుగున ఉన్న 10 శాతం మందికి చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పీ4 విధానంలో దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, రౌడీలను అణచివేస్తామని, గంజాయి ఆనవాళ్లే లేకుండా చేస్తామని తెలిపారు. ఈ విషయంలో అధికారులు సమర్థంగా పనిచేయాలని కోరారు.
నేను పరిగెడితే చాలదు… మీరూ పరిగెత్తాలి..!

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని చంద్రబాబు సూచించారు. సమస్యల్ని తీసుకుని పరిష్కారం కోసం తన వద్దకు రావడం సరికాదని, పరిష్కారం కూడా వారే ఆలోచించుకుని రావాలన్నారు. ఇది వరకు తాను మాత్రమే పరిగెత్తేవాడినని, ఇప్పుడు మంత్రులు, అధికారులు కూడా పరుగు పెట్టాలని ఆయన స్పష్టంచేశారు. మళ్లీ 1995నాటి చంద్రబాబును అప్పటి పాలనను చూస్తారని ఆయన తెలిపారు. అప్పట్లో తనతో పనిచేసినవారెవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించగా… ముగ్గురు, నలుగురు చేతులెత్తారు. ‘ఏ కార్యక్రమానికైనా నిధుల్ని ఎలా సమకూర్చుకోవాలన్న ప్రణాళికతో రండి. నా దగ్గరకు వచ్చాక దానిపై చర్చిస్తూ సమయం వృథా చేయొద్దు’ అని ఆయన పేర్కొన్నారు. ఇకపై తనతో సమావేశాలు కూడా గంట వ్యవధికి మించవని, నిర్ణయాత్మకంగా ఉంటాయని స్పష్టంచేశారు.

చెల్లించాల్సిన బకాయిలు, బిల్లులు రూ.లక్ష కోట్లు!
వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన విధ్వంసం వల్ల రాష్ట్ర విభజననాటికంటే దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. చెల్లించాల్సిన బిల్లులు, బకాయిలు రూ.లక్ష కోట్ల వరకు ఉన్నాయన్నారు. కేంద్రం ఆక్సిజన్ అందిస్తే తప్ప ముందుకెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. ‘రాష్ట్రానికి సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. పోలవరం, అమరావతితోపాటు, వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తామని చెప్పింది. ఇది మంచి పరిణామం. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది’ అని పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోలేకపోయాం. నేను కేంద్ర మంత్రుల వద్దకు వెళితే.. గత ప్రభుత్వం కనీసం యుటిలిటీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదని, నిధులు దారి మళ్లించిందని చెప్పారు’ అని తెలిపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




