రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మసీదుల్లో ఇమామ్, మౌజన్ లకు పెండింగ్ వేతనాలు విడుదల చేయడం పట్ల టిడిపి ఏపీ మైనార్టీ సెల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి. గుంతకల్ మైనార్టీ అబ్జర్వర్ గడ్డా ఫకృద్దీన్ హర్షం వ్యక్తం చేసారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో గడ్డా ఫకృద్దీన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముస్లింల ప్రార్ధన మందిరాలైన మసీదులలో ప్రార్ధనలు నిర్వహించే ఇమామ్, మౌజన్ లకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 2024 ఏప్రిల్ నుంచి పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలు సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసి వారిలో ఆనందం నింపారని తెలిపారు.ఈ నిర్ణయం ముస్లిం సమాజానికి ఎంతో సంతోషం కలిగించిందని, కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని అధికశాతం ముస్లిం సోదరులు అభిప్రాయపడుతున్నారని ఆనందం వ్యక్తం చేసారు.
ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గంట సమయం వెసులుబాటు కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని, ఉపవాసం ఆచరించే వారికి ఎటువంటి ఆటంకం లేకుండా వారికి సమయం ఇచ్చారని గడ్డా ఫకృద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫారూఖ్ లకు గడ్డా ఫకృద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.