కర్నూలు, ఆగస్టు 28: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నాల్గవ విడత పర్యటన నిర్వహించారు. శుక్రవారం నందవరం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆదోని ఆర్డీవో అరుణ దేవి పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల ప్రజలు రెవెన్యూ, తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుధ్యం, గృహ వసతి, పింఛన్లు తదితర మౌలిక వసతులకు సంబంధించిన వినతిపత్రాలను అధికారులకు సమర్పించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ నిబంధనల మేరకు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కామేశ్వర ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ల్యాండ్ సర్వే ఏడీ మురళీకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసూన్న, డీఎస్వో రాజా రఘువీర్, జిల్లా రిజిస్ట్రార్ బజారి తదితర అధికారులు పాల్గొన్నారు.