జిల్లాలో సుమారు 8 వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం జరిగిన వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుండి ఈరోజు వరకు ఉపాధి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, ఉపాధి కూలీలను నష్టం చేస్తుందన్నారు. ఒకపక్క చాలీచాలని వేతనాలు, మరోపక్క నెలలు గడుస్తున్న వేతనాలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టడం ఉపాధి హామీని నిర్వీర్యం చేయడం కోసం చేస్తున్న కుట్ర లాగా కనిపిస్తుందని ఆరోపించారు. ఉపాధి హామీ కూలీల ఐక్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న ,సహాయ కార్యదర్శి తిక్కన్న, ఆదోని, పెద్దకడబూరు, కౌతాళం, కోసిగి మండలాల ముఖ్య కార్యకర్తలు శ్రీనివాసులు, నాగేంద్ర, శంకర్, తదితరులు పాల్గొన్నారు.