నిబంధనలు ఉల్లంఘిస్తే దళారీల లైసెన్సులు రద్దు చేస్తామని ఆదోని మార్కెట్యార్డ్ కమిటీ పాలకవర్గం హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డు లో దళారులు నిబంధనలను పాటించకుండా రైతులకు ఇబ్బందులు కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారి లైసెన్సులను రద్దు చేస్తామని ఆదోని మార్కెట్యార్డ్ పాలకవర్గం స్పష్టం చేసింది.
మార్కెట్యార్డులో జరుగుతున్న వేరుశనగ కొనుగోలు ప్రక్రియను మార్కెట్యార్డ్ కమిటీ చైర్మన్ జిందే శారద, వైస్ చైర్మన్ ఆదూరి విజయ్ కృష్ణ, సెక్రటరీ సీతారామయ్య మరియు ఇతర సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులు, వ్యాపారులతో నేరుగా మాట్లాడి సమస్యలను, కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వేరుశనగను యార్డు నిబంధనల ప్రకారం నిర్ణీత పద్ధతిలో కుప్పలుగా వేయాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. విక్రయాలు సజావుగా సాగేలా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తామని మార్కెట్యార్డ్ కమిటీ వెల్లడించింది.