News
స్పందన అర్జీలను గడవు లోపు పరిష్కారం చూపాలి
కర్నూలు జిల్లా..
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు స్పందనలో పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని.

- ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామానికి చెందిన లొడ్డ ఈరన్న సంబంధించి గత కొద్ది రోజుల క్రితం నివాసముంటున్న మా యెక్క ఇల్లు కూలిపోయినది. అందులో మా ఇంటికి సంబంధించిన పత్రాలు పోగొట్టుకుపోయాయి. ప్రస్తుతం సదరు ఇంటికి సంబంధించిన పత్రాలు నకలు పత్రాలు ఇవ్వవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
- నందవరం మండలం పులిచింత గ్రామానికి చెందిన పోతురాజు నాగన్న సంబంధించి గ్రామంలో సుమారు 20 సంవత్సరాలుగా 2.50 సెంట్ల ఇంటి స్థలం లో నివాసం ఉంటున్నాము. దయతో సదరు ఇంటి స్థలం కు పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయగలరని అర్జీ సమర్పించుకున్నారు.
- ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామానికి చెందిన అంజనమ్మకు సంబంధించి సర్వే నెంబర్ 101/డి నందు 1.17 ఎకరాల భూమి ఉన్నది సదరు భూమి ఆన్లైన్ నందు 2.17 ఎకరాలుగా భూమి గా చూపిస్తుంది. దయతో సదరు భూమిని విచారణ చేసి నా యొక్క భూమిని మాత్రము ఆన్లైన్ నందు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
- మద్దికేర మండలం పెరవల్లి గ్రామానికి చెందిన బి. వెంకట సాయి రంగ సంబంధించి గత మాసంలో ఐచర్ వాహనం కొనుగోలు చేయడం జరిగినది. సదరు వాహనం రిజిస్ట్రేషన్ సాంకేతిక సమస్య వలన ఆలస్యమవుతున్నదని దయతో త్వరగా నా యొక్క వాహన రిజిస్ట్రేషన్ త్వరగా చేయగలరని అర్జీ సమర్పించుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న కార్యాలయపు పరిపాలన అధికారి శేషయ్య, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ వేణు సూర్య, శ్రీనివాస రాజు, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవికుమార్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ, డి ఎల్ డి వో నాగేశ్వరరావు, ఆర్టీవో నాగేంద్ర , ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతన్ ప్రియ, ఉప తాసిల్దారులు వినీత్, కౌసార్ భాను, పౌరసరఫరాల శాఖ ఉప తాసిల్దార్ వలి భాష తదితర అధికారులు పాల్గొన్నారు.

News
భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త
అదోని: తన భార్యను అత్తగారింటి నుండి పంపడం లేదన్న మనస్తాపంతో ఒక యువకుడు ఏకంగా రేడియో టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు మూడు గంటల పాటు హైడ్రామా నడిచిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో యువకుడు క్షేమంగా కిందకు దిగాడు.

అసలేం జరిగింది?.. ఆలూరు నియోజకవర్గం, చిప్పగిరి మండలం నేమకల్ గ్రామానికి చెందిన సురేంద్ర, అదే గ్రామానికి చెందిన నాగేశ్వరి అనే యువతిని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పండగ కోసమని నాగేశ్వరిని ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. పండగ ముగిసినా తన భార్యను తిరిగి కాపురానికి పంపకపోవడంతో సురేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
టవర్ ఎక్కి హల్చల్ : శనివారం అదోనిలోని రేడియో టవర్ ఎక్కిన సురేంద్ర, తన భార్యను పంపకపోతే కిందకు దూకేస్తానని బెదిరించాడు. మూడు గంటల పాటు టవర్ పైనే ఉండి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న సీఐ రాజశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసుల హామీతో శాంతించిన యువకుడు .. సీఐ రాజశేఖర్ టవర్ కింద నుండి సురేంద్రతో మాట్లాడి నచ్చజెప్పారు. “నీ భార్యను, మీ అత్తమామలను స్టేషన్కు పిలిపించి మాట్లాడతాం. మీ ఇద్దరినీ కలిపి కాపురానికి పంపించే బాధ్యత నాది” అని సీఐ హామీ ఇవ్వడంతో సురేంద్ర శాంతించి కిందకు దిగివచ్చాడు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం భార్యపై ఉన్న ప్రేమతోనే ఆవేశంలో ఇలాంటి పని చేశాడని సీఐ మీడియాకు వివరించారు
News
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

