ఆదోని, ఆగస్టు 1: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారి–167పై అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఆదోని బసవేశ్వర సర్కిల్ నుండి మాధవరం క్రాస్ వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) శనివారం ఆర్డీఓ శ్రీమతి కె. అరుణాదేవి నేతృత్వంలో అధికారులు పరిశీలించారు.
ఈ పరిశీలనలో రోడ్డు వెడల్పు, ప్రమాదకర మలుపులు, ప్రధాన కూడళ్లు, మీడియన్ ఓపెనింగ్స్, డ్రైనేజీ వ్యవస్థ, హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళల్లో వెలుతురు (స్ట్రీట్ లైటింగ్) మరియు పాదచారుల భద్రతా అంశాలను అధికారులు సమగ్రంగా సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి కె. అరుణాదేవి, ఆర్డీఓ ఆదేశాలు & సూచనలు చేశారు.
తక్షణ భద్రతా చర్యలు: ప్రమాదకర ప్రాంతాల్లో వెంటనే హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, రిఫ్లెక్టివ్ క్యాట్ ఐస్, క్రాష్ బ్యారియర్లు, స్పీడ్ లిమిట్ బోర్డులు, సోలార్ బ్లింకర్లను ఏర్పాటు చేయాలి. శాశ్వత పరిష్కారాలు: సర్వీస్ రోడ్లు, బస్ బేల నిర్మాణం, వర్షపు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం మరియు ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన పూర్తి చేయాలి. అవగాహన కార్యక్రమాలు: ఇంజినీరింగ్ లోపాలను సరిచేయడంతో పాటు, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఆర్డీఓతో పాటు రోడ్లు & భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహేశ్వర రెడ్డి, నేషనల్ హైవేస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (DTC) శ్రీమతి శాంతకుమారి, రెవెన్యూ, రవాణా, నేషనల్ హైవేస్, ఆర్అండ్బీ మరియు పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.