News
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు మరియు మున్సిపల్ కమిషనర్స్ సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య మరియు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇంటి పట్టా కొరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని దరఖాస్తులు అర్హులు ఉన్నారు అని ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు మరియు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని అర్హులైన వ్యక్తులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, స్థలాలను వెంటనే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ప్రభుత్వ సంకల్పం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటివరకు 1474 జాయింట్ ఎల్పిఎంలు గుర్తించగా, కేవలం 309 దరఖాస్తులు మాత్రమే అందాయని తెలిపారు. మిగిలిన దరఖాస్తులు జూన్ 30వ తేదీ లోపు పూర్తిచేయాలని తహశీల్దార్లకు ఆదేశించారు.

65 సంవత్సరాలు పైబడినవారికి మరియు దివ్యాంగులకు రేషన్ సరుకులను జూన్ 25 నుండి 30వ తేదీ లోపు డోర్ డెలివరీ చేయాలని పేర్కొన్నారు. డోర్ డెలివరీ ప్రక్రియలో ఎంతమందికి సరుకులు అందించామో, ఎంతమందికి అందించలేకపోయామో వివరాలు సమగ్రంగా ఇవ్వాలని అధికారులకు తెలిపారు. జూలై నెల రేషన్ సరుకుల పంపిణీ వంద శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు.
కౌలు రైతు కార్డులపై కూడా సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం ఆదోని డివిజన్లో 10,500 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం కేవలం 1,100 కార్డులే నమోదు అయ్యాయని తెలిపారు. జూలై 15వ తేదీ లోపు రీన్యూవల్ మరియు కొత్త దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారి బాలవర్ధరాజును ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డివిజన్లోని తాసిల్దారులు, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, గంగిరెడ్డి, ఆదోని వ్యవసాయ శాఖ అధికారి బాలవర్ధరాజు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ వేణు సూర్య, శ్రీనివాసరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
