ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.
ఘటన వివరాలు:
పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
భారీగా ఊట ధ్వంసం:
పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
నిందితుడి గుర్తింపు:
పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.