ఆదోని, ఫిబ్రవరి 18:
ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే? కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్కు చేరుకుని డ్రైవర్ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.