లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

ఎమ్మిగనూరు, మే 13:

లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..

ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. సోమన్న, ఏసీబీ డీఎస్పీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version