ఆదోని 08 మే 2026
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను ఆదోని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కోరారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు, చిన్న ట్రాక్టర్లు, తైవాన్ స్ప్రేయర్లు మరియు వివిధ రకాల ట్రాక్టర్ అనుబంధ పరికరాలు రాయితీపై అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
అర్హతలు మరియు నిబంధనలు:
భూమి కలిగిన రైతులు మరియు RoFR రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, గత మూడు సంవత్సరాలలో కనీసం మూడు పంట సీజన్లకు e-Pantaలో నమోదైన CCRC రైతులు కూడా అర్హులు. అయితే, 2024-25 సంవత్సరంలో ఇప్పటికే సబ్సిడీ పొందిన వారు మళ్ళీ దరఖాస్తు చేయడానికి వీలుండదు. ప్రతి కుటుంబం నుండి ఒకరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
సబ్సిడీ వివరాలు:
SC, ST వర్గాలకు చెందిన వారు, మహిళా రైతులు మరియు చిన్న, సన్నకారు రైతులకు యంత్రం ధరలో 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇతర రైతులకు 40 శాతం వరకు రాయితీ ఉంటుంది. రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఒకటి లేదా రెండు పరికరాలను ఎంపిక చేసుకోవచ్చు.
ఎంపిక మరియు చెల్లింపు విధానం:
రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల (RSK సిబ్బంది) సహకారంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రాక్టర్ పరికరాల కోసం దరఖాస్తు చేసే వారు ట్రాక్టర్ RC కాపీని తప్పనిసరిగా జతచేయాలి. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన రైతులకు SMS ద్వారా సమాచారం అందుతుంది. ఎంపికైన వారు 15 రోజుల్లోగా తమ వాటా సొమ్మును ఆన్లైన్ ద్వారా డీలర్ ఖాతాకు చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన గడువు తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19-05-2026 చివరి తేదీ. ఎంపిక ప్రక్రియ (లాటరీ) మే 23 నుండి 25 వరకు జరుగుతుంది. ఎంపికైన రైతులు మే 26 నుండి జూన్ 9వ తేదీ లోపు నగదు చెల్లించాలి. మే 26 నుండి జూన్ 26వ తేదీ లోపు రైతులకు యంత్రాల సరఫరా జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి స్పష్టం చేశారు.