ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. శుక్రవారం శ్వేతపత్రం విడుదల

అమరావతి : ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ – శ్వేతపత్రం విడుదల..
ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని సీఎం చంద్రబాబు..
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం, అప్పులు వంటి వివరాలను ప్రజల ముందుంచేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు..
శుక్రవారం శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్థికశాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా పరిశీలన చేసిన కూటమి ప్రభుత్వం 2019-24 మధ్య లక్షా 41 వేల 588 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లు ఉన్నట్లు తేల్చింది. 93 వేల కోట్లు సీఎఫ్ ఎమ్ ఎస్ లోకి అప్ లోడ్ చేయలేదన్న ప్రభుత్వం, 48 కోట్ల మేర బిల్లులు అప్ లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదని నిర్ధారించింది.

నీటిపారుదల శాఖ, పోలవరం బిల్లులు భారీగా పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాజెక్టులకు చెందిన 19 వేల 324 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు, ఆర్థిక శాఖ నుంచి 19 వేల 549 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు వెల్లడించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 14 వేల కోట్లకు పైగా బకాయిలు, మున్సిపల్ శాఖలో 7 వేల 700 కోట్ల బకాయిలు కలిపి మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రేపు శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

కాగా రాష్ట్రంలో అన్ని శాఖలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు అంశాలపై ఆయన శ్వేతపత్రాలను విడుదల చేశారు. పోలవరం, అమరావతి, విద్యుత్ రంగం, ఇసుక దోపిడీ వంటి అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేసిన చంద్రబాబు వాటి వివరాలను ప్రజల ముందుంచారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై బుధవారం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి గత ప్రభుత్వంలో భద్రతా వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆర్థిక సంక్షోభాన్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థికచిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version