కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లెకల్ గ్రామంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొన్నప్పటికీ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు గాని అధికారులు కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వలన నేటికీ తాగునీటికి నోచుకోవడం లేదని చాలా వీధుల్లో సక్రమంగా నీళ్లు సరఫరా కావడం లేదని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం డివైఎఫ్ఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదోని మాధవరం రోడ్డు మీద అరగంటసేపు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం సచివాలయాన్ని ముట్టడించినప్పటికీ అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేటికీ సమస్యను పరిష్కరించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి త్రాగునీరు అందించాలని లేనిపక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళనలకు ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల కార్యదర్శి వీరేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న, సిఐటియు మండల అధ్యక్షులు జే రామాంజనేయులు, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు శ్రీకృష్ణ, ఆటో యూనియన్ నాయకులు ఉరుకుందు ,వీరేష్ ,నాగార్జున, డివైఎఫ్ఐ నాయకులు రమేషు మహిళా సంఘం నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.